Saturday, May 18, 2013

భాగవతం ప్రాముఖ్యత..

భాగవతం ప్రాముఖ్యత..Bhagavatam.pdf


ఊలపల్లి సాంబశివ రావుగారి దగ్గరినుండి తీసుకున్న భాగవతము ఫైల్ ఇక్కడ పొందండి Bhagavatam.pdf

భాగవతం లేదా భాగవత పురాణం లేదా శ్రీమద్భాగవతం (Bhagavata Purana or Bhāgavatam) హిందూ మత సంప్రదాయంలోనూ, సాహిత్యంలోనూ, ఆలోచనా విధానంలోనూ ముఖ్యమైన ప్రభావం కలిగిన ఒక పురాణము. ఇది భగవంతుని కధ గాను, భగవంతునికి శరణాగతులైన భక్తుల కధగాను భక్తి యోగాన్ని చాటి చెప్పే ప్రాచీన గాధ. ప్రధానంగా విష్ణువు, కృష్ణుడు, ఇతర భగవదవతారాలు గురించి ఈ గ్రంధంలో చెప్పబడ్డాయి.

ఋషుల కోరికపై సూతుడు తాను శుక మహర్షి ద్వారా విన్న ఈ భాగవత కధను వారికి చెప్పినట్లుగాను, దానిని వేద వ్యాసుడు గ్రంధస్తం చేసినట్లుగాను ఈ కధ చెప్పబడింది. భాగవతంలో వివిధ భాగాలను "స్కంధాలు" అంటారు. వివిధ స్కంధాలలో భగవంతుని అవతార కార్యాల వర్ణనలు, భక్తుల గాధలు, పెక్కు తత్వ బోధలు, ఆరాధనా విధానాలు, ఆధ్యాత్మికమైన సంవాదాలు పొందుపరచబడినాయి. భగవంతుని లీలలు సవివరంగా వర్ణింపబడ్డాయి. అతని ౨౧ (21) అవతారాలు వర్ణింపబడ్డాయి. వైష్ణవులందరికీ ఇది పరమ పవిత్రమైన గ్రంథము. ఇది మొత్తము ద్వాదశ

వేదాంత పరంగా భాగవతం ప్రాముఖ్యత భాగవతంలోనే క్రింది శ్లోకంలో చెప్పబడింది.

సర్వ వేదాంత సారం హి శ్రీ భాగవతమీస్యతే
తద్రసామృత తృప్తస్య నాన్యత్ర స్యాద్రతి క్వచిత్

శ్రీమద్భాగవతం సకల వేదాంత సారంగా చెప్పబడింది. భాగవత రసామృతాన్ని పానం చేసినవారికి మరే ఇతరములు రుచించవు(12.13.15)వైష్ణవ సిద్ధాంతాలలో వేదాంత సూత్రాలకు భాగవత పురాణమే సహజమైన వ్యాఖ్యగా పరిగణింపబడుతున్నది. పురాణాలలో ఇది ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది.


భాగవతం ప్రాముఖ్యతను గురించి ఏల్చూరి మురళీధరరావు ఇలా వ్రాశాడు - అష్టాదశ మహాపురాణాలను ప్రస్తావించిన దేవీభాగవతంలోని శ్లోకంలో భాగవతం ఉపపురాణంగా చెప్పబడింది. అప్పటిలో (దేవీభాగవతం 12వ శతాబ్దంలో రచింపబడిందని ఒక అభిప్రాయం) శాక్తేయమతానికి ప్రాధాన్యత కల్పించే ప్రయత్నంలో ఇలా వ్రాయబడి ఉండవచ్చునని ఒక అభిప్రాయం ఉంది. లోకంలో మహాభాగవతానికి ఉన్న ప్రసిద్ధి సామాన్యమైనది కాదు. "ఈ మహా గ్రంధం ఆసేతుశీతాచల వ్యాప్త పండిత మండలీ కంఠస్థగిత విపుల మణిహారమై, నానా మత ప్రస్థాన సిద్ధాంతావిరుద్ధ ప్రమాణ తర్క సాధనోపాలంభ పూర్వక దుర్విగాహ భక్తి స్వరూప నిరూపణ ఫల వ్యాచి ఖ్యాసువులకు ఆలవాలమై, గీర్వాణ వాణీ తరుణారుణ చరణారవింద మరందాస్వాదలోల హృన్మత్త మిళింద చక్రవర్తులచే బహుభాషలలోనికి అనూదితమై, మోక్షాభిలాషుల మనస్సులలో భద్రముద్రాంకితమై, నిజానికి పురాణమంటే ఇదేనన్నంత అవిరళమైన ప్రచారాన్ని గడించింది. .. ఆధ్యాత్మిక శిఖరాల నధిరోహించిన ఈ ఉద్గ్రంధం భారతదేశంలోని సారస్వతేయుల మహాప్రతిభకు ప్రధమోదాహరణమై శాశ్వతంగా నిలిచి ఉంటుంది."
భాగవత రచనా కాల నిర్ణయం

చారిత్రికంగా భాగవతం 9వ, 10వ శతాబ్దాల సమయంలో, భక్తి మార్గం ప్రబలమైన సమయంలో, రూపు దిద్దుకొన్నదని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.కాని హిందూ మత సంప్రదాయాలలోని విశ్వాసం ప్రకారం కలియుగారంభంలో వేద వ్యాసునిచే రచింపబడినదని చెబుతారు.


కొందరి వాదనల ప్రకారం వేదాలలో సరస్వతీ నదిని ఒక మహానదిగా ప్రస్తావించినందున ఈ రచన చాలా పురాతనమైనది అయ్యుండాలి. ఎందుకంటే సరస్వతీ నది షుమారు క్రీస్తు పూర్వం 2000 సమయంలో కనుమరుగయ్యింది.


భాగవతం ప్రస్తుత పాఠం క్రీ.శ. 6వ శతాబ్ది కాలంలో రూపొంది ఉండాలని, అయితే మత్స్యపురాణంలో ఉన్న భాగవత ప్రశంసను బట్టి అంతకు పూర్వమే (క్రీ.శ. 4వ శతాబ్ది ముందే) ఒక మూలపాఠం ఉండి ఉండొచ్చునని ప్రొఫెసర్ హజరా భావించాడు. "ఫిలాసఫీ ఆఫ్ భాగవత" అనే విపుల పరిశోధన గ్రంధం ఉపోద్ఘాతంలో ప్రొఫెసర్ సిద్ధేశ్వర భట్టాచార్య ఇలా చెప్పాడు - "మొత్తం మీద శ్రీ మద్భాగవతానికి మూడు దశలలో మార్పులు, చేర్పులు జరిగాయని నిర్ణయించవచ్చును. మొదటి దశలో అతి ప్రాచీనమైన విషయ జాతకం మాత్రమే మాతృకాప్రాయమై సమకూడింది. క్రైస్తవ యుగారంభ కాలానికి రెండవ దశలో దీనికి మహాపురాణ లక్షణాలకు అనురూపమైన సంసిద్ధి లభించింది. ఇక చిట్టచివరి దశలో తముళదేశపు సాధుమండలి కృషి వలన నేటి రూపం సిద్ధించింది. ఈ దృక్కోణంనుండి పరిశీలిస్తే శ్రీమద్భాగవత ప్రకృత పాఠం ఆళ్వారులకు సమకాలంలో రూపొందినదని నమ్మవచ్చును.
భాగవతం అవతరణ

భాగవత పురాణము సంభాషణల రూపంలో రచించబడినది. పరీక్షన్మహారాజు ( పాండవ మధ్యముడైన అర్జునుని మనుమడు) ఒక బ్రాహ్మణునిచే శాపగ్రస్తుడై ఏడు దినములలోపు మరణిస్తాడని తెలిసి తన రాజ్య విధులన్నీ పక్కనబెట్టి ప్రతీ జీవి యొక్క అంతిమ లక్ష్యాన్ని తెలియగోరాడు. అదే సమయంలోనే తను సంపాదించిన అపార జ్ఞాన సంపదను ఎవరికి భోదించాలో తెలియక, ఒక మంచి శిష్యుని కోసం వెతుకుతున్న శుకుడు అనే ముని రాజుకు తారసపడి ఆ రాజుకు భోదించడానికి అంగీకరిస్తాడు. ఈ సంభాషణ ఎడతెరిపిలేకుండా ఏడు రోజులపాటు కొనసాగింది. ఈ వారం రోజుల సమయంలో రాజుకు నిద్రాహారాలు లేవు. ఒక జీవి యొక్క అంతిమ లక్ష్యం, నిత్య సత్యమైన భగవంతుడు శ్రీకృష్ణుడు గురించి తెలుసుకోవడమేనని వివరిస్తాడు.
పురాణ లక్షణాలు

పురాణాలలో వర్ణించవలసిన విషయాలను క్రీ..శ. 6వ శతాబ్దిలో అమర సింహుడు తన "నామతింగానుశాసనం"లో ఇలా చెప్పాడు.

    సర్గము: గుణముల పరిణామమైన సృష్టి సామాన్యం
    ప్రతి సర్గము: భగవంతుడు వరాడ్రూపాన్ని గ్రహించడం
    వంశము: దేవతల, రాక్షసుల, మనువుల, ఋషుల, రాజుల వంశావళి
    మన్వంతరము: ఆయా కాలాలలో వర్ధిల్లినవారి ధర్మావలంబన
    వంశానుచరితం: రాజ వంశాల వర్ణన

వ్యాస భాగవతంలో పది మహాపురాణ లక్షణాలున్నాయి:

(1) సర్గము (2) విసర్గము (3) వృత్తి (4) రక్షణము (5) మన్వంతరము (6) వంశము (7) వంశానుచరిత (8) నిరోధము (9) హేతువు (10) అపాశ్రయం.

ఈ లక్షణాలన్నీ భాగవతంలో ఉండడం వల్లనే అది మహాపురాణంగా ప్రసిద్ధమైనది.
భాగవత కధా సంక్షిప్తం
భాగవతం

స్కంధములు
ప్రధమ స్కంధము
ద్వితీయ స్కంధము
తృతీయ స్కంధము
చతుర్ధ స్కంధము
పంచమ స్కంధము
షష్టమ స్కంధము
సప్తమ స్కంధము
అష్టమ స్కంధము
నవమ స్కంధము
దశమ స్కంధము
ఏకాదశ స్కంధము
ద్వాదశ స్కంధము
**********************
కృష్ణుడు
దశావతారములు
హిందూధర్మశాస్త్రాలు
రామాయణం
మహాభారతం
పురాణాలు
వేదవ్యాసుడు
ఆంధ్ర మహాభాగవతము
బమ్మెర పోతన

భాగవతంలోని వివిధ స్కంధాలలో ఉన్న ముఖ్య విషయాలు సంక్షిప్తంగా క్రింద తెలుపబడ్డాయి.
ప్రధమ స్కంధము

    భాగవతం అవతరణ
    నారదుని పూర్వజన్మ వృత్తాంతము
    అర్జునుడు అశ్వత్థామను పరాభవించుట
    ఉత్తరకు పరీక్షిత్తు జనించుట
    గాంధారి, ధృతరాష్ట్రుల దేహత్యాగం
    ద్వారకకు వెళ్ళిన అర్జునుడు రాలేదు. ధర్మరాజు దుర్నిమిత్తములను చూచి చింతించుట
    ధర్మరాజు పరీక్షిత్తునకు పట్టం కట్టుట
    పరీక్షిన్మహారాజు భూ ధర్మ దేవతల సంవాదం వినుట
    కలి పురుషుడు ధర్మదేవతను తన్నుట
    శృంగి వలన పరీక్షిత్తు శాపము పొందుట

ద్వితీయ స్కంధము

    శుకుడు పరీక్షిత్తునకు ముక్తిమార్గం ఉపదేశించుట
    నారదుడు బ్రహ్మను ప్రపంచ ప్రకారం అడుగుట
    శుకుడు పరీక్షిత్తునకు భక్తి మార్గం చెప్పుట
    శ్రీమన్నారాయణుని లీలావతారములు
    శుకయోగీంద్రుడు పరీక్షిత్తునకు చెప్పిన సృష్టి ప్రకారం
    బ్రహ్మ తపస్సుకు మెచ్చి శ్రీమన్నారాయణుడు వరమిచ్చుట

తృతీయ స్కంధము

    విదురుని తీర్ధయాత్రలు
    విదుర నైత్రేయ సంవాదము
    హిరణ్యాక్ష హిరణ్య కశిపుల జన్మ వృత్తాంతము
    చతుర్ముఖుడొనర్చిన యక్ష దేవతా గణ సృష్టి
    కర్దముడు దేవహూతిని పరిణయమాడుట
    కర్దమ ప్రజాపతి గృహస్థ జీవనం
    కపిలావతారం
    కపిలుడు దేవహూతికి తత్వజ్ఞానం ఉపదేశించుట
    గర్భస్థుడగు శిశువు భగవానుని స్తుతించుట

చతుర్ధ స్కంధము

    కర్దమ ప్రజాపతి సంతతి
    దక్ష ప్రజాపతి సంతతి
    ఈశ్వరునకు, దక్షునకు వైరము
    సతీదేవి దక్షయజ్ఞానికరుగుట
    వీర భద్రుడు దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయుట
    బ్రహ్మాదులు ఈశ్వరుని స్తుతించుట
    శ్రీమన్నారాయణుని బ్రహ్మాదులు స్తుతించుట
    ధ్రువోపాఖ్యానము
    అంగపుత్రుడైన వేనుని చరిత్ర
    పృథు చక్రవర్తి చరిత్ర
    పృథువు గోరూపధారిణి యైన భూమినుండి ఓషధులు పితుకుట
    ఇంద్రుడు పృథువు యజ్ఞాన్ని అపహరించుట
    పృథువు సభలో సద్ధర్మమునుపదేశించుట
    పృథువు జ్ఞాన వైరాగ్యవంతుడై ముక్తినొందుట
    పృథు చక్రవర్తి వంశక్రమం
    రుద్ర గీత
    నారదుడు బర్హికి జ్ఞానమార్గం తెలియజేయుట
    పురంజనోపాఖ్యానము
    ప్రచేతసులకు భగవంతుడు వరాలిచ్చుట

పంచమ స్కంధము

    మనువు పుత్రుడైన ప్రియవ్రతుని కథ
    అగ్నీధ్రుని కథ
    ఋషభావతారం
    ఋషభుడు పుత్రులకు నీతిని బోధించుట
    భరతుని కథ
    బ్రాహ్మణ జన్మలో భరతుడు
    యమలోక వర్ణన

షష్ఠ స్కంధము

    అజామిళుని చరిత్ర
    దక్షుని హంస గుహ్య స్తవము
    బృహస్పతి దెవతలను విడనాడుట
    విశ్వరూపుడు దేవతలకు నారాయణ స్తవమును ఉపదేశించుట
    వృత్రాసుర చరిత్ర
    చిత్రకేతువు కథ
    పార్వతీదేవి చిత్రకేతుని శపించుట
    సూర్యవంశ అనుక్రణిక

సప్తమ స్కంధము

    వైకుంఠములో ద్వారపాలకులైన జయ విజయులకు శాపములు కలుగుట
    సుయజ్ఞుని కథ
    హిరణ్య కశిపుడు బ్రహ్మ వలన వరములు పొందుట
    ప్రహ్లాద చరిత్ర
    శ్రీనారసింహమూర్తి ఆవిర్భావము
    హిరణ్యకశిపుని వధ
    బ్రహ్మాది దేవతలు శ్రీనారసింహుని స్తుతించుట
    ప్రహ్లాదుడు శ్రీనారసింహుని స్తుతించుట
    త్రిపురాసుర సంహారము
    నారదుడు ధర్మరాజునకు వర్ణాశ్రమ ధర్మాలు తెలుపుట
    ప్రహ్లాద అజగర సంవాదము
    నారదుని పూర్వజన్మ వృత్తాంతము

అష్టమ స్కంధము

    గజేంద్ర మోక్షము
    క్షీరసాగర మధనం
    కూర్మావతారం
    పాల కడలిలో ఐరావతాదులు ఉద్భవించుట
    జగన్మోహిని అవతరణ
    దేవాసుర యుద్ధం
    శ్రీహరి జగన్మోహినియై పరమేశ్వరుని మోహింపజేయుట
    వామనావతారం
    వామనుడు బలిచక్రవర్తివద్దకు వచ్చుట
    వామనుడు త్రివిక్రముడై ముల్లోకములను ఆక్రమించుట
    మత్స్యావతారం

నవమ స్కంధము

    అంబరీషుని కథ
    ఇక్ష్వాకు వంశ క్రమం
    సౌభరి మహర్షి చరిత్ర
    సగర చక్రవర్తి కథ
    శ్రీరామకథ
    భవిష్యత్తు రాజుల కథ
    పరశురాముని కథ
    యయాతి కథ
    శుక్రాచార్యుడు యయాతిని శపించుట
    భరతుని చరిత్ర
    రంతిదేవుని చరిత్ర
    యదువంశము
    వసుదేవుని వంశక్రమం

దశమ స్కంధము
దశమ స్కంధము - మొదటి భాగము

    బ్రహ్మాది దేవతలు దేవకీ గర్భస్తుడైన విష్ణువును కీర్తించుట
    శ్రీకృష్ణావతారం
    దేవకీ వసుదేవుల పుర్వజన్మ వృత్తాంతము
    వ్రేపల్లెకు వచ్చిన పూతన మరణము
    బాలకృష్ణుడు శకటాసురుని సంహరించుట
    తృణావర్త సంహారము
    శ్రీకృష్ణ బలరాముల క్రీడలు
    కృష్ణుడు మన్నుతిని నోటిలో యశోదకు విశ్వరూపము చూపుట
    నంద యశోదల పూర్వజన్మ వృత్తాంతము
    యశోద కృష్ణుని వెంబడించి పట్టుకొని కట్టివేయుట
    కృష్ణుడు మద్దిచెట్టును కూల్చివేయడం
    నందాదులు బృందావనానికి తరలి వెళ్ళడం
    వత్సాసుర, బకాసురుల సంహారం
    శ్రీకృష్ణుడు గోపబాలురతో చల్దియన్నములారగించుట
    అఘాసురుని కథ
    బ్రహ్మ లేగలను, గోపాలురను మాయం చేయుట
    కాళీయ మర్దనం, కాళీయుని వృత్తాంతం, శ్రీకృష్ణస్తుతి
    శ్రీకృష్ణుడు కార్చిచ్చును కబళించుట
    బలరాముడు ప్రలంబుడనే రాక్షసుని సంహరించుట
    గోపికా వస్త్రాపహరణం
    మునిపత్నులు అన్నముతెచ్చి బాలకృష్ణునికి ఆరగింపు చేయుట
    గోవర్ధనోద్ధరణ
    శ్రీకృష్ణుడు నందగోపుని వరుణనగరంనుండి కొనితెచ్చుట
    శరద్రాత్రులలో వేణుగానం, గోపికాకృష్ణుల క్రీడలు
    సుదర్శన శాపవిమోచనం
    శంఖచూడుడు, వృషభాసురుడు, కేశి అనే రాక్షసుల వధ
    బృందావనానికి అక్రూరుడు వచ్చుట, బలరామకృష్ణులను దర్శించుట
    బలరామకృష్ణులు మధురలో ప్రవేశీంచుట
    కువలయాపీడనము అనే ఏనుగును కృష్ణుడు సంహరించుట
    బలరామకృష్ణులు చాణూరముష్ఠికులు అనే మల్లులను సంహరించుట
    కంస వధ, ఉగ్రసేనుని పట్టాభిషేకం
    భ్రమర గీతాలు
    ఉద్ధవ సహితుడైన కృష్ణుడు కుబ్జను అనుగ్రహించుట
    కాలయవనుడు కృష్ణుని పట్టుకొనబోవుట
    ముచికుందుని వృత్తాంతము
    జరాసంధుడు ప్రవర్షణగిరిని దహించుట
    రుక్మిణీ కళ్యాణము
    శ్రీకృష్ణుడు కుండిన నగరానికి వచ్చుట
    బలరాముడు రుక్మిణీదేవిని ఓదార్చుట

దశమ స్కంధము - రెండవ భాగము

    శ్రీకృష్ణుడు అపనిందను పోగొట్టుకొనుట, జాంబవతిని, సత్యభామను పెండ్లాడుట
    శ్రీకృష్ణుడు పాండవులను చూచుటకు ఇంద్రప్రస్థానికి వెళ్ళుట
    శ్రీకృష్ణుడు కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్షణ యనువారల పెండ్లాడుట
    నరకాసుర సంహారం
    ఉషాపరిణయం, బాణాసురుని కథ, చిత్రరేఖ యోగశక్తి, అనిరుద్ధుడు నాగపాశబద్ధుడగుట,
    బాణుడు, శ్రీకృష్ణుడు యుద్ధము చేయుట
    నృగమహారాజు చరిత్ర
    బలరాముడు గోపాలకులవద్దకు వెళ్ళుట
    పౌండ్రక వాసుదేవుని కథ
    ద్వివిదవానర సంహారం
    బలరాముడు తన నాగలితో హస్తినను గంగలో త్రోయబూనుట
    పదహారువేల స్త్రీజనంతో కూడియున్న కృష్ణుని మహిమను నారదుడు గుర్తించుట
    జరాసంధ భీతులైన రాజులు
    శిశుపాల వధ
    సాల్వుడు సౌభక విమానం పొంది ద్వారకపై దండెత్తుట
    శ్రీకృష్ణుడు దంతవక్తృని సంహరించుట
    బలభద్రుని తీర్ధయాత్ర
    కుచేలుని కథ
    శ్రీకృష్ణుడు బంధుగణంతో గ్రహణ స్నానం చేయుట
    లక్షణ తన వివాహ వృత్తాంతాన్ని ద్రౌపదికి చెప్పుట
    నారదాది మహర్షులు వసుదేవునితో యాగం చేయించుట
    కృష్ణ బలరాములు మృతులైన తమ అన్నలను దేవకీవసుదేవులకు చూపుట
    సుభద్రా పరిణయం
    శ్రీకృష్ణుడు ఋషి సమేతుడై మిథిలకు పోవుట
    శ్రుతిగీతలు
    విష్ణుసేవా ప్రాశస్త్యం
    వృకాసురుడు విష్ణుమాయకు లోబడి నశించుట
    భృగుమహర్షి త్రిమూర్తులను పరీక్షించుట
    శ్రీకృష్ణుడు మృత్యువు వాత బడిన విప్రకుమారులను తిరిగి బ్రతికించి తెచ్చుట
    శ్రీకృష్ణుని వంశానుక్రమ వర్ణన

ఏకాదశ స్కంధము

    విశ్వామిత్ర వశిష్ట నారదాది మహర్షులు శ్రీ కృష్ణ సందర్శనంబునకు వచ్చుట
    వసుదేవునకు నారడుండు పురాతనమైన విదేహర్షభ వివరములు చెప్పుట
    ఋషభ కుమారులైన ప్రబుద్ధ పిప్పలాయనులు చెప్పిన పరమార్ధోపదేశం
    బ్రహ్మాది దేవతలు శ్రీకృష్ణుని వైకుంఠమునకు పిలువ వచ్చుట
    కృష్ణుడు యాదవులను ప్రభాసతీర్దం పంపుట
    కృష్ణుడు ఉద్దవునికి పరమార్థోపదేశము చేయుట
    అవదూత యుదు సంవాదము
    శ్రీ కృష్ణ బలరాముల వైకుంఠ ప్రయాణము

ద్వాదశ స్కంధము

    శుకమహర్షి పరీక్షిత్తునకు భావి చరిత్ర చెప్పుట
    యుగధర్మం, ప్రళయ చతుష్టయం
    కల్ప ప్రళయ ప్రకారం
    తక్షకుడు పరీక్షిత్తును కాటు వేయుట
    జనమేజయుని సర్పయాగం
    వేద పురాణాల వ్యాప్తి
    మార్కండేయోపాఖ్యానం
    ద్వాదశాదిత్య మూర్తులు
    భాగవత ప్రశస్తి

శాస్త్రీయ పరిశీలన

ఆధునిక కాలంలో శాస్త్రీయ విజ్ఞాన పరిశోధనల ద్వారా తరచి చూస్తున్న కొన్ని విషయాలు భాగవతంలో అప్పటి సిద్ధాంతాల ప్రకారం ప్రస్తావించబడ్డాయి. మూడవ స్కంధం (11వ అధ్యాయం)లో సమయ విభాగం గురించి చెప్పబడింది. అందులో సూక్ష్మకాలం పరమాణు ప్రక్రియలకు పట్టే కాల పరిమాణం రేంజిలో ఉంది. స్థూల కాలం విశ్వం వయస్సుగా చెప్పబడే కాలం రేంజిలో ఉంది.


అలాగే 9వ స్కంధంలో తన కకుద్ముడు అనే రాజు తన కుమార్తె రేవతిని బ్రహ్మ లోకానికి తీసికొని వెళ్ళి , కొద్ది సమయం (నిముషాలు, గంటలు?) బ్రహ్మను దర్శించి తిరిగి భూలోకానికి తిరిగి వచ్చే సరిగి భూలోకంలో ఎన్నో వేల సంవత్సరాలు గతించాయి. ఈ సంఘటన ఆధునిక సాపేక్ష సిద్ధాంతంలో చెప్పబడే "కాలం వ్యవధి కుంచించుకుపోవడం లేదా పెరగడం" (Time Dilation) అనే విషయానికి సారూప్యతను కలిగి ఉంది.


3వ స్కంధంలో గర్భం ఏర్పడిన దగ్గర నుండి పిండం పెరిగే ప్రక్రియ వర్ణింపబడింది.
భాగవతంలో చెప్పబడిన భగవంతుని స్వరూపం

    ప్రధాన వ్యాసం: అవతారాలు

వరాహావతారం - ఒక ప్రాచీన చిత్రం.

భగవంతుని దివ్య స్వరూపం భాగవతంలో ఒకచోట ఇలా వర్ణించబడింది.

    తేజోమయాలైన ఆయన కన్నులు సమస్త సృష్టికి మూల స్థానాలు. సూర్యాది సకల గ్రహనక్షత్రాలు ఆయన కనుగ్రుడ్లు. అన్ని దిశలా వినగలిగిన ఆయన చెవులు సకల వేదనాదాలకు నిలయాలు. ఆయన శ్రవణం ఆకాశానికి, శబ్దానికి ఆదిస్థానం.

భాగవతంలో విష్ణువు యొక్క 25 అవతారాల లీలలు వర్ణించబడ్డాయి.
కృష్ణస్తు భగవాన్ స్వయం

యమునా నది తీరాన బృందావనంలో కృష్ణుని బాల్య లీలలు భాగవతంలో విపులంగా వర్ణించబడ్డాయి. వెన్నదొంగగా, గోపాల బాలకునిగా, గోపీజన మానస చోరునిగా, నందగోకుల సంరక్షకునిగా బాలకృష్ణుని చేష్టలు, తల్లికి తన నోట సకల భువనాలు చూపిన లోకాధినాధుని స్వరూపము, గోవర్ధన గిరిధారిగా కొండనెత్తిన వాని మహిమ - ఇవన్నీ శ్రీకృష్ణావతారం కధలో ముఖ్యమైన విశేషాలు. కృష్ణుడు తమనుండి దూరమైనపుడు గోపికలు పడే వేదన భక్తి భావానికి సంకేతంగా వర్ణిస్తారు.
వివిధ భాషలలో అనువాదాలు, భాగవతానికి సంబంధించిన రచనలు
తెలుగులో

15వ శతాబ్ధిలో బమ్మెర పోతన, అతని శిష్యుడు వెలిగందల నారయ, ఇంకా గంగన, ఏర్చూరి సింగన కలిసి ఆంధ్రీకరించిన భాగవతానికి తెలుగు సాహిత్యంలో విశిష్టమైన స్థానం ఉంది. పోతన రచనా శైలి, భక్తి భావం, పద్యాలలోని మాధుర్యం తెలుగునాట బహుళ ప్రాచుర్యాన్ని పొందాయి. దీనిలో ఎన్నో పద్యాలు నిత్య వ్యవహారంలో ఉదాహరింపబడుతున్నాయి. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఒక ప్రచురణ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఒక ప్రచురణ సాధారణంగా అందుబాటులో ఉన్నాయి.


ఇవి కాకుండా తెలుగులో భాగవతానికి, సంబంధిత పురాణాలకు సంబంధించిన పెక్కు రచనలు సంప్రదాయ సాహితయంలోను, ఆధునిక సాహిత్యంలోను, జానపద సాహిత్యంలోను ప్రముఖ స్థానం వహిస్తున్నాయి. వాటిలో కొన్ని..

    అంతరార్ధ భాగవతం - వేదుల సూర్యనారాయణ శర్మ
    భాగవత చతుశ్లోకీ - దోర్బల విశ్వనాధ శర్మ, మేళ్ళచెరువు వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    భాగవత హృదయము - ధారా రాధాకృష్ణమూర్తి
    భాగవత రత్నాకరము - విద్యాప్రకాశానందగిరి స్వామి
    భాగవత యోగం - మల్లాది పద్మావతి
    బృందావన భాగవతము - సిద్ధేశ్వరానంద భారతీ స్వామి
    గీతా భాగవత ప్రసంగాలు - ఉత్పల సత్యనారాయణాచార్య
    కుచేలోపాఖ్యానము - మండపూడి వెంకటేశ్వర్లు
    పోతన మహాభాగవతం - పడాల రామారావు
    పోతనగారి రామాయణం - అక్కిరాజు రమాపతిరావు
    రాస పంచాధ్యాయి - ఉత్పల సత్యనారాయణాచార్య
    శ్రీకృష్ణ చంద్రోదయం - ఉత్పల సత్యనారాయణాచార్య
    రమణీయ భాగవత కధలు - ముళ్ళపూడి వెంకట రమణ
    పోతన భాగవతము - ముసునూరు శివరామకృష్ణారావు
    శ్రీ మహాభాగవతము - యామిజాల పద్మనాభ స్వామి
    శ్రీమద్భాగవతము - పురిపండా అప్పల స్వామి
    శ్రీమన్నారాయణియమ్ - పాతూరి సీతారామాంజనేయులు
    శ్రీ భాగవత రసామృతము - డా.వేదవ్యాస
    శ్రీ భాగవతము-ఉపాఖ్యానములు - ప్రభల వేంకనాగలక్ష్మి
    శ్రీకృష్ణావతారం - శ్రీకృష్ణతత్వ దర్శనం - శార్వరి
    శ్రీ మహాభాగవతము - బులుసు వేంకటరమణయ్య
    శ్రీరాస పంచాధ్యాయీ - సాతులూరి గోపాలకృష్ణమూర్తి
    శ్రీమద్భాగవతము - ఏల్చూరి మురళీధరరావు
    శ్రీమద్భాగవతము - తత్వ ప్రకాశిక - తత్వవిదానంద స్వామి
    శ్రీమద్భాగవతము కధలు - వేదుల చిన్న వెంకట చయనులు
    శ్రీమద్భాగవత పురాణమ్ - చదలువాడ జయరామశాస్త్రి
    శ్రీమద్భాగవతం - ఉషశ్రీ
    శ్రీమద్భాగవతంలోని ముఖ్యపాత్రలు - ఎమ్.కృష్ణమాచార్యులు

ఇతర భాషలలో

    :గీతా ప్రెస్, గోరఖ్పూర్ వారు భాగవతాన్ని దాని హిందీ, ఇంగ్లీషు అనువాదాలను ప్రచురించారు.
    :ఆంగ్ల భాషలో 'కమలా సుబ్రహ్మణ్యం' ఒక సంక్షిప్త భాగవతాన్ని వెలువర్చింది.
    :అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థకు ప్రారంభాచార్యుడైన ఎ.సి.భక్తివేదాంత స్వామి ప్రభుపాద, అతని శిష్యులు కలసి భాగవత పురాణాన్ని ప్రతి శ్లోకానికీ సంస్కృత మూలం, ఆంగ్ల లిప్యాంతరీకరణ, ప్రతిపదార్ధం, భావం, విపుల విరణ, వ్యాఖ్యలతో ప్రచురించారు. భాగవతానికి సంబంధించిన రచనలలో (ముఖ్యంగా ఇంగ్లీషులో చదివేవారికి)ఇది చాలా ప్రసిద్ధి చెందింది.

    :అస్సామీ భాషలో శంకరదేవ భాగవతం ఆ ప్రాంతంలో మహాపురుక్షీయ ధర్మానికి మౌలికమైన ప్రామాణిక గ్రంధంగా పరిగణింపబడుతున్నది.
    ;కేరళకు చెందిన మేల్పత్తూరు నారాయణ భట్టాద్రి 1586లో సంస్కృతంలో రచించిన నారాయణీయం భాగవత సారంగాను, పారాయణ గ్రంధంగాను భక్తులచే విశ్వసింపబడుతున్నది.
    ;2003లో ఎడ్విన్ బ్రియాంట్ వ్రాసిన భాగవతం 10వ స్కంధం ఆంగ్లానువాదాన్ని పెంగ్విన్ ప్రచురణల వారు వెలువరించారు.
  :రామకృష్ణ మఠం వారు స్వామి తపస్యానంద నాలుగు భాగాలుగా వ్రాసిన ఆంగ్లానువాదాన్ని ప్రచురించారు.
 :స్వామి ప్రభవానంద The Wisdom of God: Srimat Bhagavatam అనే పేరుతో అనువాద, భావ, వ్యాఖ్యా సహితమైన ఆంగ్ల రూపకాన్ని రచించాడు.

No comments:

Post a Comment