Tuesday, May 21, 2013

శ్రీమత్ పోతన తెలుగు భాగవతము – గాయత్రీ మహా మంత్రము.


విశ్వ జన్మ స్థితి విలయంబు లెవ్వాని, వలన నేర్పడు నను వర్తనమున   
వ్యా వర్తనమునఁ గార్యములం దభిజ్ఞుఁడై, తాన రా జగుచుఁ జిత్తమునఁ జేసి
వేదంబు లజునకు విదితముల్ గావించె, నెవ్వఁడు బుధులు మోహింతు రెవ్వ
నికి నెండమావుల నీటఁ గాచాదుల, నన్యోన్యబుద్ధి దా నడరునట్లు
ఆ.
త్రిగుణసృష్టి యెందు దీపించి,
సత్యము భంగిఁ దోఁచు స్వప్రభానిరస్త
కుహకుఁ డెవ్వఁ డతనిఁ గోరి చింతించెద,
ననఘు సత్యుఁ బరుని ననుదినంబు.
1-35-వ.
   ఇట్లు "సత్యంపరంధీమహి" యను గాయత్రీ ప్రారంభమున గాయత్రీ నామబ్రహ్మ స్వరూపంబై మత్స్యపురాణంబులోన గాయత్రి నధికరించి ధర్మవిస్తరంబును వృత్రాసుర వధంబును నెందుఁ జెప్పంబడు నదియ భాగవతం బని పలుకుటం జేసి, యీ పురాణంబు శ్రీమహాభాగవతం బన నొప్పుచుండు.

   పోతన తెలుగు భాగవత కథా ప్రారంభ ఇలా మొదలైంది. “సత్యం పరం ధీమహీ” అనే గాయత్రీ మహా మంత్రంతో ప్రారంభిపబడింది కనుక గాయత్రి ‘పరబ్రహ్మ స్వరూపం’ అయ్యింది; మత్స్యపురాణంలో “గాయత్రిని మించుతు ధర్మ ప్రస్తారాన్ని, వృత్రాసుర సంహారాన్ని అభివర్ణించే గ్రంథాన్ని భాగవతం అంటారు” అని ప్రమాణీకరించబడింది. కాబట్టి శ్రీమద్భాగవతం తన సార్థక నామధేయంతో ప్రసిద్ధి చెందింది. పోతనామాత్యుల వారిచే తెలుగీకరింప బడుటచే ఇమ్మహాగ్రంథం శ్రీమత్ “పోతన తెలుగు భాగవతం” అని లోకంలో తెలియబడు తున్నది.
    ఇలా భాగవతం దేనితో సరిపోల్చ బడినదో అట్టి పరబ్రహ్మ స్వరూప మైన గాయత్రీ మంత్రం సాక్షాత్ పరదేవతా స్వరూపమే. గాయత్రీ అంతరార్థాన్ని మహాత్యాన్ని ఎంతటి వారైనా ఎంత కాలం ప్రయత్నించినా సంపూర్ణంగా వివరించ గలుగుట సాధ్యం కాదు. అంతటి గాయత్రి గురించి గాయత్రి మహాత్యం గురించి సహజంగానే మహా పురుషులు మహర్షులు అనేకులు అనేక విధాలగా ప్రవచించారు ప్రస్తుతించారు. శ్రీశ్రీశ్రీ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ విమలానంద నృసింహ భారతీ స్వామి, గుంటూరు వారు గాయత్రీ మంత్రార్థ విచారాన్ని నిరూపించే వివరణ ఒక చక్కటి పట్టిక రూపంలో అనుగ్రహించారు. ఓంకార పూర్వకంగా అనుష్టించే గాయత్రీలోని నాలుగవపాదం పొందడానికి సర్వసంగ పరిత్యాగులకే అర్హత ఉంది. కనుక మూడు పాదాల నిరూపణ అనుగ్రహింప బడింది. ఆ పట్టిక వివరాన్ని గాయత్రీ యంత్ర పటాన్ని మీతో పంచుకొనే అదృష్టం అనుగ్రహించిన గురుదేవులకు, విశ్వగురువు శ్రీకృష్ణ భగవానులకు పాదాభివందానాలు తెలుపు కుంటు ఇక్కడ ఉంచుతున్నాను.

No comments:

Post a Comment